ఎస్వీ పూర్హోమ్, ఎస్వీ కరుణాధామంలో మరింత మెరుగైన సేవలు : టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 2021 నవంబరు 27: శ్రీ వేంకటేశ్వర పూర్హోమ్లోని కుష్టు రోగులు, శ్రీవేంకటేశ్వర కరుణాధామంలోని వృద్ధులకు మరింత మెరుగైన సేవలు అందించాలని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని అక్కారంపల్లి వద్ద గల శ్రీవేంకటేశ్వర పూర్హోమ్, శ్రీవేంకటేశ్వర కరుణాధామంలను శనివారం జెఈవో పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఎస్వీ పూర్హోమ్లోని రోగుల అవసరాలను గుర్తించి సౌకర్యాలను మెరుగుపర్చలన్నారు. రోగులకు అవసరమైన మందులు, ఆహారపదార్థాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిఎమ్వో డా|| మురళిధర్ను ఆదేశించారు. అనంతరం పూర్హోమ్లోని రోగుల విశ్రాంతి గదులు, వంటగదులు పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలను రోగులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.
తరువాత కరుణాధామాన్ని జెఈవో పరిశీలించి వృద్ధులతో నేరుగా మాట్లాడి అక్కడ అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వంటల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల భారీ వర్షలకు పడిపోయిన ప్రహరీ గోడను, పూర్హోమ్, కరుణాధామంలలో చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేయాలని సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం డిపిడబ్ల్యు స్టోర్లో పంచగవ్య ఉత్పత్తుల తయారీకి సంబంధించిన యంత్రాల ఏర్పాటు, ఇందుకు అవసరమయ్యే విద్యుత్, ఇంజనీరింగ్ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల వర్షాలకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో పడిపోయిన మండపం తొలగింపు పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి జెఈవో పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Source link
The post టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం – Ttd News appeared first on Tirupati Darshan Details.