అన్నం ముట్టని ఆదివారం కథ
ఆది శంకరుని కైలాసం. పార్వతీ పరమేశ్వరులకు నివాసం పార్వతీదేవికి ఒక అలవాటుంది. రోజూ యేదో ఒక క్రొత్త కథ పరమేశ్వరుని చెప్పమని కోరేది. పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథ వినిపించేవాడు.
Related Articles
మామూలుగా పార్వతమ్మ అడగడం పరమేశ్వరుడు ఒకరోజు యిలా చెప్పాడు. “పార్వతీ! స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటులేని ఒక వ్రత కథ చెప్పుతాను విను. పూర్వం వృతాసురుని దేవేంద్రుడు సంహరించాడు. అందువలన బ్రహ్మహత్యాదోషం అతనికి కలిగింది. అప్పుడా యింద్రుడు నారాయణుని దగ్గరకుపోయి మొరపెట్టుకున్నాడు. నారాయణుడు కనికరించాడు. అప్పుడు నారాయణుడు. ఆ బ్రాహ్మహత్యా పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి మొదటి భాగం భూమికిచ్చాడు.
రెండవ భాగం చెట్టులకిచ్చాడు. మూడవ భాగం అన్ని జంగాలకూ యిచ్చి, నాలుగవ భాగం నాతులు అనగా స్త్రీలందరికీ యిచ్చాడు. సుమా! అందువలననే స్త్రీలు నాలుగు రోజులు బయట ఉంటారు. ఆ నాలుగు రోజులూ వారి భర్తలు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు. ఆ పాపం పోవాలన్న అన్నం ముట్టని ఆదివారం కథవినాలి. ఆ కథ చెప్పుతాను వినుమని యిలా చెప్పెను.
పూర్వం వేదములూ, శాస్త్రాలూ చదివిన ఒక సోమయాజి ఉన్నాడు. అతనికి ఏడుగురు కొడుకులు పుట్టారు. ఆ ఏడుగురూ మంచి గుణములు గలవారు. పుత్రికలు యిద్దరు. అందులో చివర కుమార్తె శృంగారంతో నుండేది. ఆమె ప్రతీ అమావాస్య, పున్నమిలకు భర్తకు దూరంగా ఉండేది. ఆ శృంగారపుత్రిక యీ విషయం తన తండ్రికి చెప్పింది. దాంతో ఆలోచించి ముద్దుకుమార్తెను చూచి అమ్మా! అమావాస్య లేదు, పున్నమూలేదు, నీవు ఆస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురుకు చెప్పి పంపాడు తండ్రి.
అలా రాత్రి, పగలూ భర్తను విడువకుండా అమావాస్య, పూర్ణిమలు విడిచి పెట్టాలి. ఐనా తన తండ్రి చెప్పినట్టుగా ఆ రోజులూ విడువక భర్తకు యిష్టము లేకున్నా బలవంతంతో అతనిని కూడి ఉండేది శృంగారపుత్రి. ఇలా కొంతకాలం జరిగింది. అప్పుడామె శరీరం వింతగా మారింది. నిషిద్ధమైన పూర్ణిమా, అమావాస్యలతో కూడా భర్తతో నుండుట వలన మహాపాపం ఆమెకు చుట్టుకొంది. తిండితినక అధికమైన శరీరంతో బాధపడసాగింది. ఈ వార్త తెలిసిన సోమయాజి, అతని భార్య ఎంతగానో ' బాధపడ్డారు. సోమయాజి ఆరోగ్యం సూర్య భగవానుడే యిస్తాడని తెలిసినవాడు కాబట్టి సూర్యభగవానున్ని అనేక విధాల ప్రార్థించాడు. "సూర్యదేవా! నా కూతురు తమకేమి అపరాధం చేసింది. ఏ పాపమెరగని ఈ బాలికకు శరీరంలో యీ బాధేమి తండ్రీ! అని వేడుకొన్నాడు. అప్పుడు సోమయాజికి సూర్య భగవానుడు ప్రత్యక్షమై కుమారా! నీ కూతురు అమావాస్య, పున్నమలతో కూడా భర్తను కూడుట వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది. చూడు మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది. అన్ని ధర్మాలూ తెలిసిన మహా యిల్లాలు. భర్త మాటను జవదాటని పవిత్రురాలు. ఆమె మూడు వందల అరవదిఐదు మహావ్రతాలు చేసిన పుణ్యసాధ్వి. నాకు ముఖ్యమైన భక్తురాలు. అన్నం ముట్టని ఆదివారం వ్రతాలు చేస్తుంది. ఆమె ఒక ఆదివారం ఫలము నీవడిగి తెచ్చుకొన్నావా! నీ బిడ్డ ఆరోగ్యవంతురాలౌతుందని చెప్పాడు.
సోమదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నము ముట్టకుండా సూర్యదేవుని వ్రతం చేయసాగింది. బూరెలూ, గారెలూ, అప్పాలూ నేతితో చేసి పెట్టింది. వాయనాలుంచింది. పన్నెండు మంది బ్రాహ్మణులను పిలిచింది. కాని ఒక్కరూ రాలేదు. దానికొరకు ఆమె దుఃఖిస్తుండగా సూర్య భగవానుడే ముసలి బ్రాహ్మణ రూపాన వచ్చాడు. దానికి సోమిదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది. ఆ సమయానికే ఎంతో బాధతో ఉన్న సోమయాజి వచ్చి ఆరోజు వ్రత ఫలం తనకిమ్మని యాచించాడు. ఆమె ఆశ్చర్యంతో 'అయ్యా! ఎవరైనా ధనాన్ని, ధాన్యాన్ని కోరుతారు. కాని వ్రతఫలం ఎవ్వరూ కోరరు. అనగా! ఆ పంక్తిలో నున్న సూర్య భగవానుడు లేచి, అమ్మా అతడు రోగంతో బాధపడుతున్నాడని సోమిదేవమ్మతో ఆదివారం వ్రతఫలం అతనికి ధారపోయించాడు.
దాంతో శృంగార పుత్రికి దివ్యకాంతులు వచ్చాయి. అందరూ ఆశ్చర్యం పొందారు. సోమిదేవమ్మ ఆ సోమయాజిని చూచి 'అయ్యా! మాఖమాస పూర్ణిమ ఆదివారం రోజున మీరు నియంతో యిప్పుడు నేనెలా చేశానో అలాగే అన్ని పిండివంటలతో పన్నెండుమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. అందరినీ పిలవండి. యీ వ్రతం చేయలేనివారికి యీ వ్రతకథ వినిపించండి. అనగాసోమయాజి యింటికివచ్చి ముందు కూతురుతో యీ వ్రతం చేయించాడు. స్త్రీలందరూ యిలా పాడుకొన్నారు.
పాట : సూర్యభగవానుడే చూచును మమ్ము
ఆయువు, ఆరోగ్య భాగ్యాలనిచ్చి
రక్షించు మమ్మెల్ల కాలమ్ములందు
జయము సూర్యునికి జయజయ జయము ॥సూ॥
ఇలా అందరూ పాడి అక్షతలూ తలలపై వేసికొని ఎవరింటికి వారు వెళ్లారని పరమేశ్వరుడు చెప్పాడు.
Posted by lalitha