- ప్రధాని, రాష్ట్రపతితో విడివిడిగా సమావేశం
- సీబీఐ సంక్షోభ సమయంలో కీలక చర్చలు
ఓవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతపై కత్తి దాడి ఘటన, మరోవైపు కేంద్రంలో సీబీఐలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సాయంత్రం భారత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తోనూ సమావేశమయ్యారు. తొలుత ప్రధానితో జరిగిన భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి నివేదించడంతో పాటు అనేక కీలకాంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
Related Articles
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై ప్రధానికి వివరాలు అందజేసినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఆయన నేరుగా రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్కు ఫోన్ చేసి ఆరా తీయడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. అదే సమయంలో ఇదంతా ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించే దిశగా కుట్ర చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రధానిని కలిసి కత్తి దాడి ఘటనపై పూర్తి వివరాలను అందజేయడం గమనార్హం.
సాయంత్రం గం. 5.30 ని. ల సమయంలో భారత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తో సమావేశమైన గవర్నర్ వ్యవసాయ సంస్కరణలపై ఏర్పాటు చేసిన గవర్నర్ల ఉప సంఘం నివేదికను ఆయనకు అందజేశారు. గవర్నర్ల సబ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న నరసింహన్, దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ఈ ఇద్దరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోనూ నరసింహన్ భేటీ అయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో చోటు చేసుకున్న సంక్షోభం, కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ నేపథ్యంలో నరసింహన్తో దోవల్ చర్చించినట్టు తెలుస్తోంది. గతంలో దోవల్, నరసింహన్ ఇద్దరూ ఇంటెలిజెన్స్ బ్యూరోలో కలిసి పనిచేయడంతో పాటు ఇద్దరూ ఆ సంస్థకు చీఫ్గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంక్షోభంపై నరసింహన్ సూచనలు దోవల్ అడిగి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవహారం మొత్తం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లడంతో సంక్షోభ నివారణకు కేంద్ర ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలపై చర్చించినట్టు సమాచారం.
-కె.వి.ఎన్.ఎల్.నరసింహారావు
The post హస్తినలో గవర్నర్ నరసింహన్ appeared first on .