ఈ మధ్యే ఏపీలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. సహజంగా ప్రచారంలో ముందు ఉండే చంద్రబాబు దీనిపై కూడా భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రచార హడావుడిలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిర్వహించే క్యాంటీన్ లో భోజనం చేసే ఫోటోలను చంద్రబాబు అన్న క్యాంటీన్ యాడ్స్ కు వాడేశారు. అది అక్కడ పెద్ద రచ్చ రచ్చ అయింది. ఇప్పుడు తెలంగాణ సర్కారు ప్రకటనల ‘ఉద్యమం’లో అచ్చం అలాంటిదే జరిగింది. మంగళవారం నాడు సర్కారు ప్రధాన పత్రికల నిండా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. అందులో కొత్తగా ప్రారంభించనున్న కంటి వెలుగు, రైతు భీమాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీ పర్యటన ప్రచారాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకే ఓ రోజు ముందుగా ఈ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారనే ప్రచారం ఉంది.
Related Articles
అదంతా ఓ రాజకీయ అంశం. అయితే ఈ యాడ్స్ లో చోటుచేసుకున్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది. ఒకే మహిళను వేర్వేరు వ్యక్తులతో ఫోటోలు పెట్టి ప్రకటన ఇఛ్చారు. తెలంగాణ కంటి వెలుగు ప్రకటనలో ఉన్న మహిళ, కొడుకు ఫోటోనే..రైతు భీమా యాడ్ లోనూ వాడారు. అయితే ఆమె భర్తను మాత్రం మార్చేశారు. ఈ రెండు ఫోటోలను జత చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రకటనలపై కోట్లాది రూపాయలు వెచ్చించే ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించటంపై విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక యాడ్ కోసం సిద్ధం చేసిన ఫోటోనే వాడుతూ ఆ మహిళ పక్కన వేరే వ్యక్తిని పెట్టి ఫుల్ పేజీలో ప్రకటనలు విడుదల చేయటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. ఇంత భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చేటప్పుడు కనీసం చెక్ చేసుకోరా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here