Banking: What is NEFT, RTGS in banks? Are there charges for these transactions? Here are the complete details..
Banking: బ్యాంకుల్లో NEFT, RTGS అంటే ఏమిటి? ఈ లావాదేవీలకు చార్జీలు ఉంటాయా? పూర్తి వివరాలు ఇవి..
ప్రతి ఒక్కరికీ వివిధ బ్యాంకులలో వ్యక్తిగత ఖాతాలు ఉంటాయి. వాటిలో డబ్బులను డిపాజిట్లు చేసి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా నగదు బదిలీలు అంటే డబ్బును మన ఖాతా నుంచి మరో ఖాతాలకు పంపిస్తుంటారు. ఆ సమయంలో ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ అనే విధానాల ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ అవుతుంటాయి. అయితే 2020 జనవరి ఒకటి నుంచి ఆన్లైన్లో చేసిన ఎన్ఈఎఫ్టీ నగదు బదిలీలకు చార్జీ విధించడం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ సౌకర్యం కల్పించాయి.
Related Articles
ఎన్ఈఎఫ్టీ అంటే ఏమిటి?
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ను ఎన్ఈఎఫ్టీ అంటారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఒకరి నుంచి మరొకరికి డబ్బులను పంపవచ్చు. ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అయినా నిధులను బదిలీ చేయవచ్చు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ లో కూడా ఈ అవకాశం ఉంది. దీని ద్వారా సొమ్ములు నిర్థిష్ట సమయానికి బదిలీ అవుతాయి. అది అరగంట నుంచి మూడు గంటల వరకూ ఉంటుంది.
ఆర్టీజీఎస్ అంటే..
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) విధానంలోనూ డబ్బులను వేరొకరికి బదిలీ చేయవచ్చు. దీని ద్వారా బదిలీ చాలా వేగంగా జరుగుతుంది. ఇక్కడ బదిలీ చేసిన వెంటనే వేరొకరికి ఖాతాలో జమ అవుతాయి. అయితే దీనిలో రూ.2 లక్షలకు మించి లావాదేవీలు జరపాలి. గరిష్ట పరిమితి లేదు.
అవసరమైన వివరాలు..
నగదు బదిలీల కోసం కొన్ని వివరాలు చాలా అత్యవసరం. ఆన్లైన్లో అయినా, బ్యాంకులకు వెళ్లి డబ్బు ట్రాన్స్ ఫర్ చేసినా వీటిని నమోదు చేయాలి.
- ట్రాన్స్ ఫర్ చేయాల్సిన మొత్తం.
- బెనిఫీషరీ బ్యాంకు, ఖాతా నంబరు.
- బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్
- డబ్బును ట్రాన్స్ఫర్ చేసి వ్యక్తి మొబైల్ నంబర్/ఇమెయిల్ ఐడీ
- డబ్బును పంపేందుకు కారణం (పర్పస్)
చార్జీల వివరాలు..
బ్యాంకులలో నిర్వహించే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ బదిలీలకు చార్జీలు వసూలు చేస్తారు. ఆన్ లైన్ లో చేసే బదిలీలకు కొన్ని బ్యాంకులలో మినహాయింపు ఉంటుంది. 2024 ఏప్రిల్ 17 నాటికి ఆ చార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల నుంచి ఎన్ఈఎఫ్టీ బదిలీలకు చార్జీలు వసూలు చేస్తుంది. రూ.పది వేల లోపు బదిలీలకు రూ.2 ప్లస్ జీఎస్టీ, రూ.పదివేల నుంచి రూ.1 లక్షవరకూ రూ.4 ప్లస్ జీఎస్టీ, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ రూ.12ప్లస్ జీఎస్టీ, రూ.2 లక్షలకు మించి అయితే రూ.20 ప్లస్ జీఎస్టీ విధిస్తుంది. అలాగే ఆర్ టీజీఎస్ బదిలీలకు సంబంధించి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ట్రాన్స్ ఫర్ కోసం రూ.20 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎన్ఈఎఫ్టీ చార్జీల వివరాల విషయానికి వస్తే రూ.1 లక్షలోపు బదిలీలకు రూ.2 ప్లస్ జీఎస్టీ, ఆ పైన వాటికి రూ.10 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఆర్టీజీఎస్ చార్జీలు రూ.15 ప్లస్ జీఎస్టీగా ఉన్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్ లో రూ.పదివేల వరకూ 2, రూ.1 లక్ష వరకూ 4, అలాగే 1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ రూ.14, ఆపై రూ.2 లక్షల నుంచి బదిలీలకు రూ.24 చార్జీ వసూలు చేస్తారు. ఇక ఆర్ టీజీఎస్ కు సంబంధించి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ రూ.20, అలాగే రూ.5 లక్షల వరకూ రూ.40 చార్జీ విధిస్తారు.