Women Reservation Bill : Actually Women Reservation Bill..? Do you know the benefits of this for women?
Women Reservation Bill : అసలేంటీ మహిళా రిజర్వేషన్ బిల్లు..? దీనివల్ల మహిళలకు కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా..?
Women Reservation Bill : ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం.. మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill). అసలు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏంటి..? ఇన్నేళ్లుగా ఎందుకు పెండింగ్లో ఉంది..? దీని వల్ల మహిళలకు ఒనగూరే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర పెంచడానికి రూపొందించినదే ఈ ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం లోక్సభలో 542 సీట్లకు గాను.. 78 మంది మహిళా ఎంపీలుంటే.. రాజ్యసభలో 224 సీట్లలో 24 మంది మహిళలున్నారు. ఉభయసభల్లో మొత్తం 102 మంది మహిళా ఎంపీలున్నారు. ఈ లెక్కన చూస్తే.. పార్లమెంట్లో 13.3 శాతం మాత్రమే మహిళలున్నారు. ఈ సంఖ్యను 33 శాతానికి పెంచాలనే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)ను రూపొందించారు.
ఈ ఆలోచనకు దాదాపు 27 ఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. 1996లో హెచ్డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. చివరకు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్సభలో మాత్రం పెండింగ్లోనే ఉండిపోయింది.
ఆపై 2014లో లోక్సభ రద్దు కావడంతో మరోసారి బిల్లు అడుగున పడిపోయింది. మరలా తొమ్మిదేళ్ల అనంతరం తాజాగా మరోసారి ఈ బిల్లు తెరమీదకొచ్చింది. అయితే ఈసారి కేబినెట్ ఆమోదం తెలపడంతో తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఉభయసభల ఆమోదం పొందాక.. లోక్సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. ఈ బిల్లును ‘నారీ శక్తి వందన అధినియమ్’గా పేర్కొన్న ప్రధాని మోదీ.. 2027లో జనగణన పూర్తయ్యాకే ఇది చట్టరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.
ఇది చట్టరూపం దాల్చితే.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు దక్కితే.. ప్రస్తుతం ఉన్న మహిళా ఎంపీల సంఖ్య 181కి పెరుగుతుంది. ప్రస్తుతం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీలు, ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్ చేశారు. వీటిల్లో నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు.