జిళ్ళెళ్ళమూడి అమ్మ, అయ్య అమ్మ పక్కన చిన్నపిల్లను నేనే-పుట్టపర్తి అనూరాధ |
తెన్నాలి కవి
''పరమ పదనాధ నిరవధిక కృపాపరిపాక పరిచిన సరస్కవితా సనాధు '' డట..
ఆతని ' పరమ పద నాధుడు' ను అతనివంటి హాస్యప్రియుడే..
ఈ విషయ మాయన వేషమే చెప్పుచున్నది..
ఆ కృష్ణునకు మంచి వెడదలగు కన్నులున్నవి..
వ్రేతల వలపించు వెరవులున్నవి..
మంచి పింఛమును జెరివినాడు
మువ్వంక మురువుతో.. మురళితో ..చూచుటకు ముచ్చటైనవాడు..
ఇన్నియుండియును పాపము దిస్సమొలయేనట..
ఒక్కొక్కసారి ''కడారపటుడై '' గనుపించును..
'చిప్ప కూకటియు'
నాకృష్ణునకు రామకృష్ణుడు నేర్పిన యొక సౌందర్యము..
ఎన్నియేండ్లనుంచి పట్టుకున్నాడో.. యా ప్రాత చిక్కము ..
నొకసారియైనను వదలడా పరబ్రహ్మము..
గచ్చకాయలో.. మద్దికాయలో యా కృష్ణుని సొమ్ములు..
ముక్కున ముంగరముత్యము కదలుచుండవలసినదే..
ఒకవేళ పాండురంగడు నడచినచో ..
'' పుట పుటనైయున చిని బొజ్జయు గదలుచు..
భక్తులతో ..రంగడేగాదు నేనుగూడ నున్నా '' నని హెచ్చరించుచుండును..
ఇట్లీకవి సృష్టించిన కృష్ణమూర్తి నూహించికొన్నప్పుడు
నా భావనలో
రామకృష్ణకవికి నకలు మూర్తియే గోచరించును..
ఇక నాదైవమును కవి సంబోధించు రీతులు గూడ పలుపలు రకములు..
ఒకసారి '' నందులేబట్టి '' యని..
సామాన్యముగ ననును..
ఒకపరి '' దేవకితర్ణక '' మని
గోకులమందున్న దూడలతో గోపాల కృష్ణుని గూడ లెక్కవేసి మాటాడును..
ఇంకొకసారి '' అఖిల నిమౌఘ గిరి గుహా హరి పృధుక '' మని యేమో గంభీరము గ
నతని గొప్పను జెప్పును..
మరల నొకపరి
'' ఎన్ని కల్పంబులరిగిన యేనయేండ్ల - వెలయు ప్రాయంబుగల కొయ్య విఠలయ్య ''
అని కుండ బగులగొట్టినట్లు రహస్యమును విప్పి చూపి
కృష్ణుని పరిహాసము జేయును..
లేక విసుగును జూపించును..
ఆ కృష్ణునివలెనే ఈ రామకృష్ణుడును
'' అవిదితగతి ''
ఈ పరమ పద నాధుని యుపాసనయు
రామకృష్ణుని నాటికి దెనుగుదేశమున నింకను బాగుగ బ్రాకలేదు..
కృష్ణరాయలొక్కమారు పండరికిపోయి వచ్చినటుల చరిత్రయున్నది..
అతనికా దేవునిపై భక్తి ప్రపత్తులుండుటకు గురుతా రాయలు గట్టిన విఠలాలయమే..
రామరాయలకును
పాండురంగనితో సంబంధమున్నట్లేవో కథలున్నవి..
ఎవరికో అక్కడక్కడ నొకరిర్వురికి
పండరినాధునిపై కన్నున్నను
ప్రజా సామాన్యమునకా యుపాసన
తెనాలి కవి నాటికి బాగుగా పా దుకొన్నదిగాదు..
తాతలనుండి రామభద్రుడు
తెనుగులకు నచ్చినదైవము..
కృష్ణరాయలకు '' విఠ్ఠల సంప్రదాయము ''
సోకుటాకు గారణమున్నది..
అతని కాలమునందును ..
అందుకు కొంత పూర్వమును
వైష్ణవముదే ప్రధమతాంబూలమైనను
దానిప్రక్కలో ద్వైతముగుడ ఎదిగినది..
రాయలనాడే
వ్యాసరాయలు.. కనకదాసు.. పురందరులు మొదలగువారుండిరి..
వీరందరు ప్రధానముగ పాండురంగని యుపాసకులే..
వెంకటపతి రాయల కాలమున ద్వైతులలో సామ్రాజ్యముతో నాంతరిక సంబంధముగలవారెవ్వరును గనుపింపరు..
మరి వైష్ణవుల శిష్యుడైన తెన్నాలికవికీ ద్వైతవాసన యెట్లుపట్టెనో
ఆతడొక చిత్రపురుషుడు..
Related Articles
This post first appeared on à°ªà±à°Ÿà±à°Ÿà°ªà°°à±à°¤à°¿ సాహితీ, please read the originial post: here