ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి బుధవారం ప్రకటన విడుదల చేసింది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల విభాగంలో 4,775 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టులన్నీ కాంట్రాక్టు విధానంలో నియామకాలు చేపడుతున్నట్లు వివరించింది. వీటిని సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7 నుంచే ప్రారంభం అవనుందని తెలిపింది. ఏప్రిల్ 16ను తుది గడువుగా పేర్కొంది. అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలని, ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో నమోదై ఉండాలని వివరించింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థలు వయసు 35 ఏళ్లలోపు ఉండాలని తెలిపింది. జోన్-1 (విశాఖ) పరిధిలో 974 ఖాళీలు, జోన్-2 (రాజమండ్రి) పరిధిలో 1,446 ఖాళీలు, జోన్-3 (గుంటూరు) పరిధిలో 967 ఖాళీలు ఉన్నాయి. ఇక జోన్-4 (కడప) పరిధిలో 1,368 ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు hmfw.ap.gov.in, cfw.ap.nic.in వెబ్ సైట్లను అభ్యర్థులు సందర్శించవచ్చు.