టాలీవుడ్ లో రచ్చ రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీరెడ్డి లేవనెత్తిన అంశాలు కొన్ని అయితే..ఈ వ్యవహారం అటు రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. రాంగోపాల్ వర్మ నికృష్టుడని, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అని వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీ పెద్దగా ఇన్ని రోజులు సహనంగా ఉన్నానని, కానీ కొన్ని సంఘటనలు చూశాక ప్రెస్మీట్ పెట్టానన్నారు. శ్రీరెడ్డి ఆరోపణలపై సినీ పరిశ్రమ సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ఇండస్ట్రీ మంచిపని చేయబోతోంది. రిడ్రెస్సల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కమిటీలో 50 శాతం ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు మహిళలు, ఎన్జీవోలు ఉంటారు. తప్పు చేసిన నిర్మాత, దర్శకులు ఎవరైనా ఉన్నారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘మూడు తరాలుగా ఇండస్ట్రీనే నమ్ముకున్నాం. కానీ కొందరు అనవసరంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. నేను రాంగోపాల్ వర్మను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను. వర్మ ఓ నికృష్టుడు అని చెబుతున్నా. సినీ పరిశ్రమలో పుట్టి పెరిగిన వర్మ.. ఇప్పుడు తల్లిలాంటి ఇండస్ట్రీకి ద్రోహం చేస్తున్నాడు. శ్రీరెడ్డితో పవన్ కల్యాన్ను తిట్టించింది తానేనని వర్మ స్వయంగా ఒప్పుకున్నాడు.
Related Articles
శ్రీరెడ్డి విషయం బయటకు చెబుతుందని తెలిసే.. తన వెదవ తెలివితేటలు చూపిస్తూ వర్మ హడావుడిగా వీడియో రిలీజ్ చేశాడు. వర్మ నీ బతుక్కి ఇదంతా అవసరమా.. నీకు పవన్పై ఉన్న కోపాన్ని శ్రీరెడ్డితో తీర్చుకోవాలి అనుకున్నావంటూ’ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండస్ట్రీలో అందరూ చాలా బాధపడుతున్నారు. ఛాతీ విరుచుకుని మేం తెలుగువారమని చెప్పుకునేలా ఉండాలి. కానీ తల్లిలాంటి ఇండస్ట్రీని వర్మ మోసం చేశాడు. వర్మ కుట్ర వెనుక ఎవరున్నారు. నిర్మాత సురేష్ బాబు ఫ్యామిలీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇప్పించాలని చూశానని వర్మ చెబుతున్నాడు. నేను సురేష్ ఫ్యామిలీకి ఫోన్ చేశా. మేం ఎవరికీ భయపడం. హుందాగా వెళ్తామని ఆ కుటుంబం తెలిపిందని అల్లు అరవింద్ వివరించారు. శ్రీరెడ్డి ద్వారా పవన్ పై తనకున్న కక్షను తీర్చుకోవాలనుకుంటున్నాడా? వర్మ అని ప్రశ్నించారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here