Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మత్తు కథా చిత్రంలో మరో ట్విస్ట్ – సెలవులో అకున్ సభర్వాల్

అనుకున్నదే జరుగుతోంది. ఏదైనా పెద్ద కేసుని, పెద్దవాళ్ళని కదిలించడానికి ప్రయత్నిస్తే రాజకీయ ఒత్తిళ్ళు ఏరకంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అదే ఏదైనా సున్నితమైన కేసు విషయంలో అయితే రాజకీయ ఒత్తిళ్ళు ఎంత సిన్సియర్ అధికారికైనా తప్పవని మరోసారి నిరూపితమైంది. డ్రగ్ రాకెట్‌ను బయటపెట్టి అందరికీ చెమటలు పట్టిస్తున్న అకున్ సభర్వాల్ సెలవు విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డ్రగ్ మాఫియా తలుచుకుంటే ఎంతటివారిపైనైనా తమ అజమాయిషీ నడిపించి తమ పనులు చేసుకుంటుందని అర్థమైపోతోంది.

అకున్ సభర్వాల్ సెలవు వ్యవహారంపై ఇప్పుడు చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. డ్రగ్స్ కేసులో మాఫియా కోరలు పీకుతారని, ఎంతపెద్ద వాళ్ళకైనా ఇక కష్టాలు తప్పవని అందరూ అనుకుంటుంటే  డ్రగ్స్ పై హడావిడి చేసిన అధికారి అకున్ సబర్వాల్ సెలవు పెట్టేయాల్సి వచ్చింది. అసలు కేసు కీలకంగా మారుతున్న పరిస్థితుల్లో అకున్ సెలవు తీసుకోవడం రాజకీయ ఒత్తిళ్ళ వల్లే అని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. సినీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య సత్సంబంధాలు చెడిపోకుండా ఉండేందుకే అడ్డుగోడగా ఉన్న పోలీసు అధికారి అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్లడం జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. అంతేగాక అకున్ సభర్వాల్ మళ్ళీ డ్యూటీలో చేరేసరికి ఈ కేసును ఏం చేస్తారన్న అనుమానాలు ఇటు రాజకీయ నేతల్లో అటు జనాల్లో నెలకొన్నాయి.

See Also: డ్రగ్ రాకెట్‌లో బయటపడాల్సిన పేర్లు ఎన్నో..??

గతంలో నయీం కేసు విషయంలోనూ జరిగిన హడావిడి సైతం అంతా ఇంతా కాదు. పెద్ద ఎత్తున దుమారమేరేపింది. అందులో కావాలని మీడియాలో హడావిడి కోసం ఎంతో మంది రాజకీయ నాయకుల పేర్లు, పోలీసు బాసుల పేర్లు బయటకి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటారనుకుంటే అందుకోసం సిట్ వేసి తీరా అందరూ మంచివారేనన్నట్లు కేసును మూసేశారు. ఈ కేసులోనూ అదే హడావిడి జరుగుతోందన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

See Also: డర్టీ పిక్చర్ : డ్రగ్స్ కేసులో బయటపడుతున్నమేకప్

త‌న సెల‌వు పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మైన‌ద‌నీ, రెండు నెల‌ల క్రితం సెల‌వు పెడితే ఇప్పుడు మంజూరైంద‌నీ అకున్ సభర్వాల్ చెబుతున్నారు. అయితే రెండు నెల‌ల క్రితం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే డ్రగ్స్ రాకెట్‌ను బయటపెట్టి ఇంత కీలక విచారణ మొదలవుతున్న సమయంలో సెలవు మంజూరు చేయ‌ాల్సిన అవసరం ఏమొచ్చింది?? ఒకవేళ పోలీస్ బాసులపై ఎలాంటి ఒత్తిడి లేకపోతే ఇంత‌వ‌ర‌కూ ఇవ్వని సెలవును కేసు కీల‌క‌మైనసమయంలో స‌భర్వాల్‌ను సెల‌వు తీసుకోమ‌ని ఆదేశించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంతేగాక పోలీసులకు ఇంత పెద్ద కేసుకంటే సెలవే అంత ప్రధానంగా కనిపించిందా అనే ప్రశ్నలు లేవనెత్తున్నారు జనాలు.

రవితేజ త‌మ్ముడు భ‌ర‌త్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌ రోజునుండి చాప‌కింద నీరులా సాగిన విచార‌ణ ఒక్క‌సారిగా బాంబులా పేలింది. హైద‌రాబాద్‌నే కాకుండా సినిమా ప‌రిశ్ర‌మ‌ను కుదిపేసింది. సినీ ప్ర‌ముఖులు ఒకే వేదిక‌పైకి వ‌చ్చి, సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. అంతేగాక డ్రగ్స్ మాఫియాను పెకిలించే పనికి ఒక అధికారి పూనుకోవడాన్ని సినీ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. సినీ పరిశ్రమ అభాసుపాలయ్యే పరిస్థితి ఉంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతారన్న భయంతోనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగిందన్న ప్రచారం ఉంది.  తాజాగా ఈరోజు ర‌వి తేజ‌, పూరి జ‌గ‌న్నాథ్ స‌హా కొంత‌మంది ప్ర‌ముఖులకు ఎక్స‌యిజ్ శాఖ నోటీసులంద‌డం.. ఈ నెల 19 నుంచి వారిని విచారించ‌నుండ‌టం వంటి ప‌రిణామాల మ‌ధ్య స‌బ‌ర్వాల్ సెల‌వులో వెళ్ళ‌డం మ‌రో సంచ‌ల‌నానికి దారితీసింది.

See Also: నోటీసులు వచ్చిన మాట నిజమే – నేనేం తప్పు చేయలేదు

ఇదే సమయంలో సందట్లో సడేమియాల్లాగా మీడియా చేస్తున్న హడావిడి కూడా అంతా ఇంతా కాదు. దొరికిందే ఛాన్సులాగా పోలీసులు ఇస్తున్న లీకులతో ఎవరికి తోచిన స్టోరీలు వాళ్ళు నడుపుకుంటూ డ్రగ్స్ కేసులో సంచలనాలకు తెరలేపుతున్నారు. నయీం కేసులోనూ ఇంతే హడావిడి చేసి చివరికి అందరూ మంచివారేనని సర్టిఫికెట్లు ఇస్తూ మీడియా నడిపిన స్టోరీలు చూసిన జనాలు కూడా డ్రగ్స్ కేసులో మీడియా చేస్తున్న హడావిడిని చూసి దుయ్యబడుతున్నారు.

The post మత్తు కథా చిత్రంలో మరో ట్విస్ట్ – సెలవులో అకున్ సభర్వాల్ appeared first on .



This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

మత్తు కథా చిత్రంలో మరో ట్విస్ట్ – సెలవులో అకున్ సభర్వాల్

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×