ముత్తూట్ ఫైనాన్స్ చోరీ యత్నం కేసులో నిందితులు వాడిన వాహనాన్ని సీసీ కెమరాల్లో గుర్తించిన అధికారులకు మళ్ళీ కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పటివరకు అనేకసార్లు స్పెషల్ డ్రైవ్లు చేసి కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్లు తొలగించే ప్రయత్నం చేసిన అధికారుల కళ్ళుగప్పి ఇప్పటికీ అనేక వాహనాలు బ్లాక్ ఫిల్మ్లతోనే తిరుగుతున్నాయి. ముత్తూట్ కేసు విచారణతో అప్రమత్తమైన పోలీసులు ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్ను మరోసారి గట్టిగా చేపట్టాలని నిర్ణయించారు.
Related Articles
ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్లో భాగంగా ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా కార్లు తదితర వాహనాల అద్దాలపై ఉంటున్న బ్లాక్ఫిల్మ్లను వెంటనే తొలగించండి. కార్లలోపల స్పష్టంగా కనిపించేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని ఇప్పటికి ఎన్నోసార్లు పోలీసులు, ఆర్టీఎ అధికారులు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టిన వాళ్ళకు ఈసారి కోదండం తప్పేటట్లులేదు.
దీంతో కార్ల లోపల స్పష్టంగా బయటకు కనిపించేలా చర్యలు తీసుకోవాలని 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నగర ట్రాఫిక్ విభాగం అధికారులు మరోసారి అమలులోకి తీసుకురానున్నారు. 2012లో తొలిదశ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు ప్రజల్లో అవగాహన తీసుకువచ్చారు. ఆ ఫలితంగా హైదరాబాద్ నగరంలో దాదాపు 95 శాతం వాహనాల అద్దాలకు ఉన్న బ్లాక్ఫిల్మ్ తొలగింది. అయితే మిగిలిన కొన్ని వాహనాలు ఇప్పటికీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వారిని పట్టుకోవడం కోసం 10తేదీ నుండి ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్ అనే స్పెషల్ డ్రైవ్ను మొదలుపెట్టనున్నారు.
See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు
బ్లాక్ ఫిల్మ్ ఉంచుకున్న వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలో ఉండని అర్ధరాత్రి టైంలోనే బయటకు రావడం, ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు సైతం బ్లాక్ఫిల్మ్ ఉంటున్నట్లు గుర్తించిన అధికారులు ఇప్పటికే కొంతమందిపై ఈ తరహా ఉల్లంఘనలపై 44, 079 కేసులు నమోదు చేశారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఓ ఉల్లంఘనపై జరిమానా విధిస్తే… మళ్ళీ 24 గంటలు దాటే వరకు అదే ఉల్లంఘనపై, అదే వాహనానికి మరోసారి జరిమానా విధించే ఆస్కారం ఉండదు. అయితే సోమవారం నుంచి చేపట్టబోయే స్పెషల్ డ్రైవ్లో పోలీసులకు దొరికిన వాహనాలకు బ్లాక్ఫిల్మ్ కేసుల్లో ఒక రోజులో ఎన్ని చోట్ల వాహనం కనిపిస్తే అన్ని చలాన్లు జారీ చేయనున్నారు పోలీసులు.
The post ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్ షురూ appeared first on .