ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ రెండవ భాగం ‘మహానాయకుడు’ విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవటంతో ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. సంక్రాంతికి విడుదలైన కథానాయకుడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. సినిమా బాగానే ఉన్నా బాలకృష్ణపై ఉన్న వ్యతిరేకత సినిమాపై పడినట్లు స్పష్టంగా కన్పిస్తోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువ మంది ఎన్టీఆర్ ను బాలకృష్ణలో చూడటానికి ఆసక్తి చూపించకపోవటం…పైగా సినిమాపై జరిగిన వ్యతిరేక ప్రచారం కూడా వసూళ్లను దెబ్బతీశాయి. వాస్తవానికి కథానాయకుడు సినిమాను దర్శకుడు క్రిష్ చక్కగా తెరకెక్కించారనే చెప్పొచ్చు.
Related Articles
అయినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఎన్టీఆర్ బయోపిక్ లోని మహానాయకుడు ప్రధానంగా ఎన్టీఆర్ రాజకీయ రంగానికి సంబంధించినది. దీంతో ఈ సినిమా ఎక్కువ వివాదాలకు కేంద్రం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసిన సంఘటనలు సినిమాలో ఉంటాయా?. ఉండవా అన్న చర్చ సాగుతోంది. పార్టీ పెట్టి ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత సన్నివేశాలతోనే ముగింపు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే చరిత్రను వక్రీకరించారనే విమర్శలు బాలకృష్ణ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here