ఒడిదుడుకుల బాట నుంచి ఎన్టీఆర్ ఈ మధ్యే ‘హిట్’ పట్టాలు ఎక్కాడు. టెంపర్ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి చూడకుండా హిట్స్ తో దూసుకెళుతున్నాడు. టెంపర్..నాన్నకు ప్రేమతో, జనతా గ్యారెజ్ అన్నీ ఎన్టీఆర్ కు మంచి ఫలితాలనే ఇచ్చాయి. వరసగా మూడు హిట్ల తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమానే ‘జైలవకుశ’. దీంతో సహజంగానే దీనిపై అంచనాలు భారీ స్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. ఈ మూడు పాత్రలకు సంబంధించి రిలీజ్ అయిన టీజర్లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులో మందు వరసలో నిలిచింది ‘జై’ క్యారెక్టరే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మూడు పాత్రల టీజర్స్..ట్రైలర్ సూపర్ సక్సెస్ తర్వాత భారీ అంచనాల మధ్య గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ‘జైలవకుశ’ సినిమా విడుదలైంది. మరి ఎన్టీఆర్ తన హిట్ ట్రాక్ ను కొనసాగించాడా…లేదా? తెలుసుకోవాలంటే మరింత ముందుకు సాగాల్సిందే.
Related Articles
ఇక అసలు కథ విషయానికి వస్తే చిన్నప్పుడే జై,లవ, కుశ తల్లిదండ్రులు చనిపోతారు. వీళ్ళ ఆలనా పాలనా మామ (పోసాని కృష్ణమురళీ) చూసుకుంటాడు. చిన్నప్పుడే వీరు ముగ్గురూ నాటకాలు వేస్తూ తమ ప్రతిభను చూపిస్తుంటారు. అయితే కీలక క్యారెక్టర్లు అన్నీ లవ, కుశకు మాత్రమ దక్కుతాయి. నత్తితో మాట్లాడే ‘జై’కు ఎప్పుడూ కన్పించని పాత్రలే. దీంతో ‘జై’ వీళ్ళపై పగ పెంచుకుని ఓ నాటక ప్రదర్శన సమయంలో కావాలని అగ్నిప్రమాదానికి కారణం అవుతాడు. అక్కడే అన్నదమ్ములు ముగ్గురూ చెల్లాచెదురవుతారు. తర్వాత లవ బ్యాంక్ మేనేజర్ గా…కుశ చిల్లర దొంగతనాలు చేసేవాడిగా దర్శనం ఇస్తాడు. జై మాత్రం పగతో..ప్రతీకారంతో రావణాసురుడిని అభిమానించే రావణ్ గా మారి ఓ గ్రామంలో దందాలు..అక్రమాలు సాగిస్తాడు. ఓ కారు ప్రమాదంలో లవ, కుశలు తారసపడతారు. అక్కడ నుంచే అసలు కథ ప్రారంభం అవుతుంది. తర్వాత లవ ప్రేమించిన ప్రియ ను(రాశీఖన్నా), కుశ అమెరికా వెళ్లేందుకు దోచుకున్న ఐదుకోట్లను ‘జై’ తీసుకెళతాడు. అంతేకాదు వీరిద్దరిని తన దగ్గర బందీగా పెట్టుకుని తన అవసరాలు తీర్చుకుంటాడు. రాజకీయంగా ఎదిగేందుకు జై ఆడే డ్రామాలు రక్తికట్టాయి. ఆ అవసరాలు ఏంటి…తర్వాత జైలవకుశలు ఒక్కటయ్యారా? లేదా అన్నది వెండితెరపైనే చూడాలి.
ఇక నటన విషయానికి వస్తే మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతమైన వేరియేషన్స్ చూపించారు. లవగా చాలా సాఫ్ట్ క్యారెక్టర్ లో..కుశగా ఆకతాయిగా తిరిగే కుర్రాడి పాత్రలో కన్పించారు. సినిమాకు అత్యంత కీలకమైన క్యారెక్టర్ ‘జై’లో కూడా ఎన్టీఆర్ నటన అదుర్స్ అనేలా ఉంది. రావణ్ గా ఎన్టీఆర్ నత్తితో చెప్పిన డైలాగులు పెద్దగా ఆకట్టుకోకపోయినా ఓకే అనేలా ఉన్నాయి. అయితే సినిమాను సరదాగా నడిపించింది అంతా తన డైలాగులతో కుశ క్యారెక్టరే. ముఖ్యంగా జై క్యారెక్టర్ కు సంబంధించిన బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అయితే సినిమాలో పలు డైలాగులు ఎలాంటి కామెడీ అవసరం లేకుండానే ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్ల రద్దు ప్రకటనను డైరక్టర్ బాబీ కుశ క్యారెక్టర్ కు అద్భుతంగా కనెక్ట్ చేశాడు. ఈ సీన్ చూసినప్పుడు అందరూ పగలబడి నవ్వాల్సిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తర్వాత చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు అంటే పోసాని కృష్ణమురళీ, సాయికుమార్ లవే . వీరిద్దరి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్లు రాశీ ఖన్నా, నివేదా థామస్ లకు పెద్దగా నటనకు స్కోప్ లేకుండా పోయింది. తమన్నా సహజంగానే ఐటెం సాంగ్ లో అదరగొట్టేసి వెళ్ళింది. సినిమా మొదట ఐదు నిమిషాలు..చివర్లో కొంత బోర్ కొట్టించే సీన్లు లేకుండా చేసి ఉంటే మరింత బాగుండేది. అంతిమంగా ‘జైలవకుశ’ ‘జై’ కొట్టొచ్చు.
Ja
The post ‘జైలవకుశ’ మూవీ రివ్యూ appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here